CRDA: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది సీఆర్డీఏ అథారిటీ.. ఇప్పటికే రూ.49,154 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరో 15,757 కోట్ల రూపాయల విలువైన పనులకూ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మొత్తంగా రాజధాని అమరావతిలో రూ.64,912 కోట్ల పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. దీంతో, ఈ రోజు భేటీ కీలకంగా మారనుంది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించిన విషయం విదితమే… సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమైన సీఎం… ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. ప్రధాని మోడీ పర్యటన ఆసాంతం సక్సెస్ అయ్యేలా సమన్వయం కోసం అన్ని స్ధాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు.