TDP New Committees: తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగు వేసింది. పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ విస్తృత స్థాయిలో కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీల్లో సీనియర్లకు గౌరవం కల్పించడంతో పాటు కొత్తవారికి అవకాశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కమిటీల కూర్పు చేసినట్లు వెల్లడించాయి. తాజా కమిటీల్లో మంత్రి నారా లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగించారు. లోకేష్ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. పార్టీకి సేవలు చేసిన వారికి, విధేయతతో కష్టపడ్డ నాయకులకు ఈ నియామకాలలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Ramayana Movie:’రామాయణ’ షూటింగ్ పై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ రివీల్
పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదిక అయిన పొలిట్బ్యూరోను 29 మందితో ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీని 31 మందితో, రాష్ట్ర కమిటీని 185 మందితో రూపొందించారు. జాతీయ స్థాయిలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు, 10 మంది అధికార ప్రతినిధులను నియమించారు. రాష్ట్ర స్థాయిలో 7 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 మంది కార్యదర్శులను నియమించారు. ఈసారి కమిటీల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణ స్థాయి కార్యకర్తలకు కూడా అత్యున్నత కమిటీల్లో చోటు కల్పించడం విశేషంగా మారింది. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ Guttikonda Dhanunjayలకు నేరుగా పొలిట్బ్యూరోలో స్థానం కల్పించడం చర్చనీయాంశమైంది.
మహిళలకు కూడా ఈసారి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ.. రాష్ట్ర కమిటీలో 185 మందిలో 50 మంది మహిళలకు అవకాశం కల్పించారు. అలాగే పొలిట్బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. భవిష్యత్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా కమిటీలను రూపొందించినట్లు పార్టీ తెలిపింది. రాష్ట్ర కమిటీలో 122 మంది బడుగు వర్గాలకు స్థానం కల్పించారు. అందులో బీసీలు 77 మంది, ఎస్సీలు 25 మంది, ఎస్టీలు 7 మంది, మైనార్టీలు 13 మంది ఉన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ కమిటీలను రూపొందించినట్లు పార్టీ అధిష్టానం పేర్కొంది.
