Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. అమరావతిని తొమ్మిది నగరాల రాజధానిగా చెబుతూ ఇప్పుడు ఒక మున్సిపాలిటీ స్థాయికే పరిమితం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2015లో టెండర్లు పిలిచి, 2016లో శంకుస్థాపన చేసిన భవనాలను 2028లో ప్రారంభిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిలో నిర్మించిన భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరెవరు నివసిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వ భూములు లేదా కొనుగోలు చేసిన భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేసి ఉంటే తక్కువ వ్యయంతో పూర్తయ్యేదని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతి నిర్మాణం చేపడుతున్నారని, భవిష్యత్తులో ఈ భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుందని విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే వాదన వాస్తవానికి విరుద్ధమని అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్వహణ, వర్షాకాలంలో నీటి పారుదల వంటి అంశాలపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీ అప్పులు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని ఎలా తీర్చబోతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తామని, తమను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా వెనక్కి తగ్గబోమని పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అమరావతికి సంబంధించిన ఆస్తుల వివరాలు, ఖర్చుల లెక్కలు ప్రజలకు వెల్లడించాలని కోరారు. అమరావతి అంశంతో పాటు రాష్ట్రంలోని ఇతర పరిణామాలపైనా పేర్ని నాని స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారుల డీజిల్ పంపిణీ, పోలీసుల వ్యవహారశైలి, డీఎస్సీ, లాకప్ డెత్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం లెక్కలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధంగా రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు.

