Deputy CM Pawan Kalyan: అనుమతులు ఉన్న మైనింగ్ కు అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిబంధనల ప్రకారం మైనింగ్ చేసే వారిని బెదిరిస్తున్నారన్నారు.. ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు… పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరి కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. మధ్యప్రదేవాసులు గ్రానైట్ కోసం అనుమతి పొందారని. కానీ, అడ్డుకుంటున్నారని పవన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్గా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Curd In Winter: శీతాకాలంలో పెరుగు తినడం హానికరమా?.. అసలు నిజం ఏంటంటే?
రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్, మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే.. పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు.