Gudapati Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కూటమి సర్కార్లో కీలకమైన తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గూడపాటి శ్రీనివాసరావు .. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గూడపాటి శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసి మంచి చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పార్టీ అభ్యర్థి మోహన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్.. గూడపాటి శ్రీనివాసరావు చేరికతో రేపల్లె పట్టణంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్.. కాగా, ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా.. అడపదడపా.. ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్.. ఇక, తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

