Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త భార్గవ్ నాయుడు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ సూచించిందన్న ప్రచారంపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఉంటే ముందుగా తనకే తెలియజేస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి రావడాన్ని అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. బోండా ఉమాను పిలిచిన తర్వాత తనను పిలవడంతోనే అనవసర ప్రచారం జరుగుతోందని అఖిలప్రియ పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ నాయకులతో వేదిక పంచుకోలేదని, ఎలాంటి కాంట్రాక్టర్లను బెదిరించలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

పార్టీ సమావేశంలో జిల్లా సమస్యలు, కార్యకర్తల అంశాలు, సభ్యత్వ కార్యక్రమం, వ్యక్తిగత విషయాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ పిలిచిందంటే ఏదో తప్పు జరిగిందని భావించడం సరికాదన్నారు అఖిలప్రియ.. అహోబిలంలో జరుగుతున్న పరిణామాలపై మీడియా, ప్రజలు దృష్టి సారించాలని అఖిలప్రియ కోరారు. మూడు రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో ఓ మైనర్ బాలికపై దాడి యత్నం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ విషయం మీడియాలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదని అన్నారు. అహోబిలం మఠం పరిధిలో ఉన్నందున అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని, ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని వివరించారు.

అహోబిలంలో జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందో స్థానిక ప్రజలను అడిగితే నిజాలు తెలుస్తాయని, తాను చెబితే రాజకీయ రంగు పులుముతారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..