Minister Parthasarathy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ లక్ష్యాలనే ముఖ్యంగా భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.
‘విద్వేషాలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం’
గతంలో బాబాయ్ హత్య, కోడికత్తి ఘటన, తుని రైలు దహనం వంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు కూడా అంతకంటే తీవ్రమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు పార్థసారథి.. ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తే వారు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక, దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తు చేసుకోవాలని మంత్రి అన్నారు. అనంతబాబు కేసు, దళిత వైద్యుడి మరణం వంటి ఘటనల్లో అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో మేధావులు ఆలోచించాలని సూచించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు.
అమరావతి, మూడు రాజధానులపై వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తీర్మానానికి గతంలో వైఎస్ జగన్ మద్దతు తెలిపారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు విస్మరించారో చెప్పాలని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఆయా ప్రాంతాల ప్రజలను అయోమయంలోకి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష హోదాపై వ్యాఖ్యలు
వైఎస్ జగన్కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అయితే రాజ్యాంగంలో లేని ప్రతిపక్ష హోదాను మాత్రం కోరుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లపై అసభ్య వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. మరోవైపు.. సోషల్ మీడియాను ప్రభుత్వం మీద అసత్య ప్రచారం కోసం ఉపయోగిస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నటుడు ప్రకాష్ రాజ్కు లేదని వ్యాఖ్యానించారు మంత్రి కొలుసు పార్థసారథి..

