Tirumala Parakamani Case: సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు మరోసారి హైకోర్టు దృష్టిని ఆకర్షించింది. ఈ కేసులో జరిగిన వివాదాస్పద పరిణామాలు, ముఖ్యంగా లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ఒప్పందం చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది.
Read Also: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత కోసం సీఐడీ నూతనంగా ఒక అదనపు నివేదికను హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో రాజీ ప్రక్రియపై మరిన్ని వివరాలు, సంబంధిత పత్రాలు ఉన్నట్లు సమాచారం. అయితే, సీఐడీ సమర్పించిన అదనపు నివేదికకు మరో రెండు సెట్స్ సిద్ధం చేసి, వాటిని సీల్డ్ కవర్లలో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ నడుస్తున్నందున వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసులో జరిగిన లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను పరిశీలిస్తోంది. కోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తూ.. “సీఐడీ సమర్పించిన అన్ని నివేదికలను ధర్మాసనం ముందు ఉంచాలి” అని ఆదేశించింది. ఈ నివేదికల ఆధారంగా రాజీ ఒప్పందం చట్టపరంగా నిలబడుతుందా లేదా అన్న దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అయితే,సీఐడీ సమర్పించిన తాజా నివేదికను పూర్తిగా పరిశీలించి, తదుపరి ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. తదుపరి విచారణలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. తిరుమల పరకామణి చోరీ వివాదంలో లోక్ అదాలత్ ఒప్పందం నిజంగా చట్టబద్ధమా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వెలువడనుంది.