Site icon NTV Telugu

Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

Kolusu Parthasarathy

Kolusu Parthasarathy

Journalist Pension Scheme: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టు మిత్రులకు ఉగాది సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే జర్నలిస్టుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.

Read Also: 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

వెటరన్ జర్నలిస్టులకు వారు కోరిన జిల్లాలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి.. జర్నలిస్టులకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన విధాన ప్రకటన చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, అవార్డుల పంపిణీతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, హెల్త్ కార్డుల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే పలు జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి..

Exit mobile version