AP Government: పాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని బిజినెస్ రూల్స్ను మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ వ్యవస్థలో కొనసాగుతున్న రొటీన్ విధానాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించిన ఆయన.. కాలానుగుణంగా పరిపాలనా విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆర్టిజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం బలోపేతం కావాలంటే డేటా షేరింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దీనికోసం ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఆయా శాఖల సమాచారం నిరంతరం ఆర్టిజీఎస్కు చేరేలా ఈ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ మార్పులతో ప్రభుత్వ నిర్ణయాలు మరింత వేగంగా అమలవడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
