NTV Telugu Site icon

CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్‌ వార్నింగ్..!

Cm

Cm

CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.. పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100 శాతం మద్దతు ఉంటుందని తెలిపారు.. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తానన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం

ఇక, ఓవైపు ఆదేశాలు ఇస్తూనే.. మరోవైపు వార్నింగ్‌లు కూడా ఇచ్చేశారు సీఎం చంద్రబాబు.. అధికారులెవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తానూ కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే తన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానని గుర్తుచేసుకున్నారు.. అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్ధతిలో సమీక్షలు చేపట్టాలని కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ఇప్పటికీ అధికార యంత్రాంగం సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు.. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశం అంటున్నారు.. మదనపల్లె సంఘటనతో ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలు బయట పడ్డాయని చంద్రబాబు భావిస్తున్నారట.. అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించడం.. పరిపాలనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేయడానికి ఈ కీలక భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబు..

నేను 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ, ఎప్పుడూ లేనన్ని సమస్యలు, భిన్నమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందన్నారు చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోంది. నాడు తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన పాలసీల వ‌ల్లే అక్కడ ఈ ఫలితాలు వచ్చాయి. అమెరికాలో కూడా భార‌తీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. వైట్ అమెరికన్స్ 65 వేల డాలర్లు తలసరి ఆదాయం పొందుతున్నారు. కానీ, ఇండియన్స్ 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పెంచుతున్నారు. తెలుగు వాళ్లు ప్రపంచంలో, దేశంలో ముందుకు వెళుతున్నారు. కానీ, ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెల‌కొందని ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. మొన్న ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 57 శాతం ఓట్ షేర్ వచ్చింది. గత 5 ఏళ్లు ప్రజలు పడిన కష్టాల కారణంగా వచ్చిన ఫలితం ఇది అన్నారు. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అని ఇతర రాష్ట్రాలకు ఉపాదికోసం వెళ్లిన వాళ్లు.. ఇతర దేశాల్లో ఉన్న వారు వచ్చి ఓట్లు వేశారు. మొన్నటి ఎన్నికలు ఒక నిశ‌బ్ద విప్లవం… ఈ ఫ‌లితాల‌తో ఒక కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొన్నారు..

2014లో లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించినా 43 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అండగా నిలిచాం అన్నారు చంద్రబాబు.. 2014 కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కు బిల్లులు, బకాయిలు ఉన్నాయి. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నాడు 13.5 శాతం వృద్ది రేటు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది. విభజనకంటే ఎక్కువ నష్టం 2019 నుంచి ఉన్న వైసీపీ పాలన వల్ల జరిగింది. కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. మూడు పార్టీలుగా కలిసి పోటీ చేశాం. కేంద్రం కూడా ఇప్పుడు సాయం చేయ‌డానికి ముందుకు వచ్చింది. ఇది మంచి పరిణామం. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అని చెప్పాం.. దాన్ని నిజం చేసి చూపించాలన్నారు.

ఏడాదిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు తేగలం అనేది చూసి అంత‌మేర కేంద్రం నుంచి తీసుకు వచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి. శాంతి భ‌ద్రత‌ల విష‌యంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. రౌడీలను అణిచివేస్తాం. గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఈ విషయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పేదరికం లేని సమాజం అనేది మా ప్రభుత్వం లక్ష్యం. దీని కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలసీలు పక్కాగా అమలు చేయడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు. కలిసి ముందుకు వెళదాం. ప్రగ‌తిశీల, ప్రభావాత్మక పాల‌న (ప్రోగ్రసివ్, ఎఫెక్టివ్ గవర్నెన్స్) అందిద్దాం. ఓట్లు వేరు.. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మంచి చేశాం అనే ఒక తృప్తి ఉంటుంది. నా అరెస్టు సమయంలో అంతమంది రోడ్డెక్కడానికి కారణం అంతకుముందు నేను చేసిన మంచే కారణం. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.. అధికారులు కూడా బ్యూరోక్రటిక్ కోణం కాకుండా.. మాన‌వీయ కోణంతో పనిచేయాలి. ప్రజలు సాయం కోరి వస్తే.. ఆ సమస్య ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి. కేవ‌లం రూల్స్ గురించి మాత్రమే ఆలోచిస్తే అందరికీ మంచి చేయలేం అన్నారు సీఎం చంద్రబాబు.