Amaravati Fire Accidents: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అయితే, అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్ అండ్ టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మేఘా ఇంజినీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజానిజాలు వెలికితీయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ను నియమించింది.
ఈ దర్యాప్తు బృందానికి గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వం వహించనున్నారు. బృందంలో నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉండగా, తుళ్లూరు సీఐ, డీఎస్పీ కూడా సభ్యులుగా ఉన్నారు. అదనంగా సాంకేతిక నిపుణుల సహకారంతో విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నారు. అగ్నిప్రమాదాల వెనుక ఉన్న కారణాలు, ఏవైనా నిర్లక్ష్యాలు లేదా ఇతర అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై సిట్ విచారణ ద్వారా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.