తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్షోలో బాబు వాహనంపైకి అగంతకులు రాళ్లు రువ్వారు. దాంతో, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. రాళ్ల దాడిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు క్రిష్టాపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపధ్యంలో సీఎం జగన్ డౌన్డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. గాయపడిన వారితో చంద్రబాబు మాట్లాడారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా స్టేషన్ ముందు ఆయన బైఠాయించారు. నిరసన వద్దని చంద్రబాబును పోలీసులు కోరారు. తనకు రక్షణ కల్పించలేని మీరు సామాన్యులకు ఏం రక్షన కల్పిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు.