కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, హిమాలయాల్లో కరోనాకు చెక్ పెట్టే మొక్కలు ఉన్నాయని ఐఐటి మండి, ఐసీజీఎంబీ లు గుర్తించాయి. హిమాలయాల్లో పెరిగే రోడో డెండ్రాన్ అర్బోరియం అనే మొక్కకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని, ఈ మొక్కలోని పూరేకుల్లో ఫైటోకెమికల్స్ ఉన్నాయని, ఈ ఫైటో కెమికల్స్కు కరోనా వైరస్ను ఎదుర్కొనే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోడో డెండ్రాన్ అర్బోరియం మొక్కను స్థానికంగా బురాన్ష్ అని పిలుస్తారు. ఈ మొక్క పూరేకులను స్థానికులు అనేక ఆయుర్వేద ఔషదాల్లో వినియోగిస్తారు. టీకా లు కాకుండా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ఇతర పద్దతులపై ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మొక్కల నుంచి లభించే ఆయుర్వేద ఔషదాలు శరీరంలోని కణాల్లోకి ప్రవేశించి వైరస్ను అడ్డుకుంటాయని, వైరస్ను అడ్డుకునే శక్తిని శరీరానికి కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి హిమాలయాల్లో నివశించే స్థానికులు ఈ బురాన్ష్ను ఔషద మూలికల్లో వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.