ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ఏర్పాటు పై గడ్కరీతో చర్చించారు.
విశాఖలో 6 లేన్ల రహదారిని,విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి అంశంపై చర్చించారు. విజయవాడ తూర్పు బైపాస్పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని గడ్కరీని కోరారు జగన్. కత్తిపూడి – ఒంగోలు కారిడర్లో భాగంగా ఎన్హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్రమంత్రిని కోరారు.
విశాఖ– భోగాపురం బీచ్ కారిడర్ ప్రాజెక్ట్కు సంబంధించి గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు… అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని వివరించారు సీఎం. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు జగన్.
విజయవాడ వెస్ట్రన్ బైసాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. విజయవాడ వెస్ట్రన్ బైపాస్కు సంబంధించి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. విజయవాడ ఈస్ట్రన్ బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధం చేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ గడ్కరీని కోరారు జగన్.
CM Jagan Delhi Tour: కేంద్రమంత్రులతో జగన్ వరుస భేటీలు.. కీలక అంశాలపై చర్చ
రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరు చేయాలని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం జగన్ కోరారు.