గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. EC ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు.
ఈ విషయంపై రాజా సింగ్ సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని రాజాసింగ్ కు స్పష్టం చేసింది. అయినా గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్ పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశామని మంగళ్ హాట్ పోలీసులు తెలిపారు. ప్రెస్మీట్లు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై సైతం నిషేధం విధించింది ఈసీ. వివిధ రకాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్పై 72 గంటలపాటు నిషేధం విధించింది ఈసీ.