యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు.
అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం కేసీఆర్ ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.
ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కేసీఆర్ పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. ఆలయ తుది పనులపై సీఎం కేసీఆర్ వారికి పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు. ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీష్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు. అనంతరం చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈవో గీతకు సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, చినజీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు. ‘మీకు పీఆర్సీ వస్తుందా ?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వీవీఐపీ గెస్ట్ హౌజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.