నేడు ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం కాన్పూర్ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు.
నేడు హర్యానా కేబినెట్ విస్తరణ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది.
నేడు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరుగనుంది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరుగనున్న ఈ ఆయిల్ ఫామ్ సమ్మిట్ కు 9 రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు హజరుకానున్నారు. ఆయిల్ సాగు, ఎగుమతిపై సమ్మిట్లో చర్చించనున్నారు.
నేడు హైదరాబాద్లో సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో 317తో స్థానికతను కోల్పోయిన టీచర్లను సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు, సినిమా థియేటర్ల మూసివేత జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత, టికెట్ ధరలపై ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశారు.
నేడు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి, ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు, జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
నేడు ఉదయం 11.30 గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం నిర్వహించనుంది. వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్, మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీపై చర్చించనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి యాసంగి రైతుబంధు నిధులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరునుంది. రైతుల ఖాతాల్లో రూ.7645.66 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు రూ.50 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది.
నేడు అర్హులై సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 18.47 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.703 కోట్ల నగదును ప్రభుత్వం జమచేయనుంది.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000 లుగా ఉంది.