NTV Telugu Site icon

కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ-20 కెప్టెన్సీకి గుడ్‌బై..!

భారత జట్టును అన్ని విభాగాల్లో విజయవంతంగా నడిపించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20 టీమ్‌ కెప్టెన్‌గా వైదొలగనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అయితే, టెస్ట్‌లు, వన్డేలకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్టు పేర్కొన్నాడు కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.. అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్‌ తర్వాత టీ20 కెప్టెన్‌గా తాను వైదొలుగుతానంటూ ఓ లేఖను ట్వీట్ చేశాడు కోహ్లీ.. గత 8-9 ఏళ్లుగా తనపై వర్క్‌ లోడ్‌ అధికంగా ఉందన్న ఆయన.. టెస్ట్‌, వన్డే టీమ్‌లకు నాయకత్వం వహించేందుకు మరింత సమయం వెచ్చించాలని అనుకుంటున్నానన్నారు.. అయితే, టీ20 మ్యాచ్‌లలో ఆటగానిగా మాత్రం కొనసాగనున్నట్టు పేర్కొన్నాడు..

యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ తర్వాత టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పనున్నాడు విరాట్ కోహ్లీ.. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి లేఖలు రాశారు.. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నాను.. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లకు ఆడుతున్నాను.. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు.. కాగా, గత కొంతకాలంగా టీ-20 క్రికెట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అవుతారనే ప్రచారం జరిగింది… ఈ ప్రచారాన్ని బీసీసీఐ ఖండించినా.. చివరకు విరాట్‌ కోహ్లీయే ఆ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ కెప్టెన్ గా టీమిండియా 45 టీ 20 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.. కెప్టెన్ గా 95 వన్డే మ్యాచ్‌లు ఆడగా 65 మ్యాచ్‌లలో విజయం నమోదు చేసింది..