అసలే ఎన్నికల టైం. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఇవాళ పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లను పంపిణీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా శనివారం 60 వేలమందికి స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు అందజేసింది. వీటిని అందుకున్న విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్ వినీత్ మాట్లాడారు. ఇప్పటికే 38 లక్షల మందికి పైగా విద్యార్థులు డీజీ శక్తి పోర్టల్లో నమోదు చేయించుకున్నారని అన్నారు. తొలివిడతలో భాగంగా 60వేల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లను శనివారం పంపిణీ చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జయంతిని పురస్కరించుకుని లఖ్నవూలోని ఇకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీటిని విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు తరలిరావడంతో ఇకానా స్టేడియం జనసందోహంగా మారింది. యువత నిరాశవాదాన్ని వీడాలని, విశాలంగా ఆలోచించాలని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలోని కోటిమందికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు అందిస్తామని యోగి చెప్పారు. యువత దేశం గురించి ఆలోచించాలన్నారు.