కరోనా సృష్టించిన కల్లోలంతో గత ఏడాది మూతపడిన స్కూళ్లు ఇప్పటికీ తెరుచుకున్న పరిస్థితి లేదు.. కొన్ని సార్లు ప్రయత్నాలు చేసినా.. కరోనా కేసులతో వెనక్కి తగ్గాయి ప్రభుత్వాలు.. దీంతో.. ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. కానీ, చాలా మందికి ఇది అందని ద్రాక్షలాగే మిగిలపోయింది.. ఎప్పుడు కరోనా పోతుందా? మరెప్పుడు స్కూళ్లు తెరుస్తారా? అని కొందరు ఎదరుచూస్తుంటే.. అయ్యో కరోనా ఉంది.. మా పిల్లలను స్కూళ్లకు పంపం అనేవాళ్లు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా.. స్థానిక పరిస్థితుల మేరకు దశలవారీగా స్కూళ్లను తెరువవచ్చని సూచించారు.. పిల్లలు చదువును కోల్పోతుండటంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎక్కువ కాలం స్కూళ్ల మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.. డిజిటల్ సౌకర్యాలు లేని ఎందరో పిల్లలు ఆన్లైన్ విద్యను పొందలేకపోతున్నారని.. పిల్లల సాధారణ జీవితాన్ని మాత్రమేగాక వారి సమగ్ర అభివృద్ధిలో పాఠశాల విద్య ప్రాముఖ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
అయితే, కరోనా కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితుల మేరకు స్కూళ్లను తెరువవచ్చని డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో స్కూలు తెరువడంపై ప్రణాళికలు రూపొందించుకోవచ్చన్న ఆయన.. ఒకవేళ కరోనా పెరిగితే స్కూళ్లను మూసివేయడమా? లేదా విద్యార్థులను రోజు విడిచి రోజు స్కూళ్లకు రప్పించడం వంటి పద్ధతులను పాటించేవిధంగా ప్లాన్ చేయాలన్నారు.. ఇక, తరగతి గదుల్లో వెంటిలేషన్, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి తప్పక పాటించేలా చూసుకోవన్నారు. అంతేకాదు.. పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని, దీని వల్ల చాలా మంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు.. మరోవైపు.. ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్ లేదా థర్డ్ వేవ్ రెండేళ్ల చిన్నారులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పిల్లలపై అంతగా ప్రభావితం చేసే అవకాశం కూడా లేదని తెలిపారు. ఇక, పిల్లల వ్యాక్సిన్ ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్న గులేరియా.. సెప్టెంబర్ నాటికి భారత్లో పిల్లల టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉందన్నారు.