కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఏ వ్యక్తికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. పెళ్ళైనా వారు, పెళ్లి కానివారు, పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్దమైన వారు ఇలా ఎవర్ని కరోనా మహమ్మారి వదలడం లేదు.
మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని అనగా, పెళ్లి కుమారుడు కరోనాతో బలయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. సాలూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈనెల 23 వ తేదీన పెళ్లి పెట్టుకున్నాడు. అయితే, ఈనెల 13 వ తేదీన కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న సమయంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్ మృతి చెందాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళాలు మోగడంతో విషాదం నెలకొన్నది.