రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ జల్పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో పట్టాలు అదుపు తప్పింది. దీంతో రైలులోని 12 బోగీలు ఒకదానివెంట మరొకటి బోల్తా కొట్టాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందినట్లు, మరో 50 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఇండియన్ రైల్వే, బెంగాల్ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి.
దాదాపు 34 నెలల విరామం తర్వాత గురువారం జరిగిన ప్రమాదంలో ప్రయాణీకులు మరణించిన మొదటి సంఘటనగా రైల్వే నివేదించింది. చివరిసారిగా మార్చి 22, 2019న జరిగిన ప్రమాదంలో ప్రయాణీకుల మరణాలు నమోదయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్ వీకే త్రిపాఠి, డైరెక్టర్ జనరల్ (భద్రత) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.