వివిధ సమస్యలపై కేంద్రానికి వరుసగా లేఖరాస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా మరో లేఖ రాశారు.. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరారు.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్లో మూతపడిన సీసీఐని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా పలు సార్లు కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని.. అయితే, ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.
1984లో ఆదిలాబాద్ లో సుమారు 47 కోట్ల వ్యయంతో సీసీఐని ఏర్పాటు చేయడం జరిగింది, సిసిఐకి 772 ఎకరాల్లో ప్లాంట్ ఉంది.. దీంతోపాటు 170 ఎకరాల్లో సీసీఐ టౌన్షిప్ కూడా ఉన్న విషయాన్ని లేఖలో గుర్తుచేశారు కేటీఆర్.. ఈ ప్లాంట్ ద్వారా మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవని, దురదృష్టవశాత్తు 1996లో నిధుల లేమితో కార్యకలాపాలు ఆగాయని, 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పూర్తిగా మూసి వేయడం జరిగిందని తెలిపారు.. అయితే, ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లారని, అప్పటి నుంచి ఈ అంశం పైన స్టేటస్ కో ఉందని, ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని వివరించారు.. సీసీఐకి ప్రత్యేకంగా 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉన్నదని.. ఇప్పటికీ 32 కేవీఏ విద్యుత్ సరఫరా కనెక్షన్, అవసరమైన నీటి లభ్యత ప్లాంట్ కి ఉన్నాయని.. తన లేఖలో పేర్కొన్నారు.. కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అవసరమైన బొగ్గు సరఫరాను స్థానిక సింగరేణి కార్పొరేషన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించిన కేటీఆర్.. ఇలా సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణకు అనేక సానుకూల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ దిశగా తగిన చర్యలను వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేంద్రమంత్రిని కోరారు.