తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు… సుమారు 3 గంటలపాటు ఆయన పర్యటన కొనసాగింది.. దళిత కుటుంబాల మహిళలు కేసీఆర్కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బందు పథకం గురించి తెలుసా? అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి రూ. 10 లక్షలు వస్తే ఏం చేస్తారు..? దళిత బందు డబ్బులు వస్తే ఏం చేద్దాం అని అనుకున్నారు.. అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని.. కొందరు ట్రాక్టర్లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలియజేశారు.
తన పర్యటనలో ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ… మీకు పెన్షన్ వస్తుందా..? అని ఆరా తీశారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. దళితవాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇళ్లలో ఇంటిలోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సూచించారు. దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు సీఎం. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’’అని తెలిపారు.
ఇక, ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్లు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించగా.. అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళితబంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం.. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు.. పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరికీ పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్లు వస్తున్నాయా..? రైతు బంధు డబ్బులు వస్తున్నయా? ఏ పంటలు సాగు చేస్తున్నారు..? అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గరకు వెళ్లి పెన్షన్ లో కొంత ఏమైనా పక్కకు పొదుపు చేసుకుంటున్నారా? అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగావున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాలవాళ్లకు ఆర్థిక సహాయం అందించి వాళ్ల కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.