తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీబిజీగా వున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు.

సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్కు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు స్టాలిన్. రేపు సాయంత్రం 4-5 గంటల మధ్య స్టాలిన్ నివాసంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. ఇవాళ రాత్రికి ఐటీసీ హోటల్లో సీఎం కేసీఆర్ బస చేస్తారు.
