సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో కమిటీలో భాగస్వామ్యం కా లేకపోయారని, అందువల్లే తీర్పు ఆలస్యం అవుతోందని సెప్టెంబరు 23న పేర్కొంది సుప్రీం.. అయితే, ఈ కేసులో సమగ్ర అఫిడవిట్ కేంద్రం అందించని నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ లేకుండానే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది సీజేఐ ధర్మాసనం.. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి తీర్పు వెలువడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే బయటికి వచ్చిన పెగాసెస్ గూఢచర్యం వ్యవహారం సంచలనాన్ని రేపింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. విపక్షాలన్నీ పెగాసెస్పై చర్చ జరపాలని పట్టు బడడంతో.. ఇతర అంశాలపై చర్చ సాగకుండానే సమావేశాలు వాయిదా పడిన పరిస్థితి.. అయితే, ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ జర్నలిస్టుల స్మార్ట్ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసిందని కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను భంగం చేసిందని, అక్రమంగా వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడిందని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నిరసనలతోనే పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. మరోవైపు.. ఇప్పటికే శీతాకాల సమావేశాల షెడ్యూల్ కూడా వచ్చేసింది.. ఈ తరుణంలో వస్తున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. మరోసారి ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.