NTV Telugu Site icon

టీమిండియా పరాజయాలకు కారణం అది కాదంటున్న గవాస్కర్

టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లకుండానే నిష్క్రమించనుంది. సోమవారం నామమాత్రంగా జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ పరాజయాలకు టాస్ కారణమన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. భారత్ ఓటములకు టాస్ ఎంత మాత్రం కారణం కాదన్నారు. మన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారని సన్నీ తెలిపాడు. వారు తెలివిగా బంతులు వేయడం వల్ల మనవాళ్లు పరుగులు చేయలేకపోయారని వివరించాడు.

Read Also: మరో వివాదంలో ఇరుకున్న ఫేస్‌బుక్‌

ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మనవాళ్లు గొప్పగా పుంజుకుని భారీ స్కోరు చేశారని.. అదే తరహాలో తొలి రెండు మ్యాచ్‌లలో ఆడి ఉంటే భారత్ సెమీస్‌కు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ ఓ ఐసీసీ ఈవెంట్‌లో నాకౌట్ చేరకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇవాళ్టి మ్యాచ్… కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, కోచ్‌గా రవిశాస్త్రికి ఆఖరిది.