కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇక మహమ్మారి పని అయిపోయిందని భావించి అంతా కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు.. నో మాస్క్, నో సోషల్ డిస్టెన్స్ అనే తరహాలో ప్రవర్తించారు ప్రజలు.. దీంతో.. సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. మళ్లీ కేసులు తగ్గుముఖం పడుతునున్నాయి.. పండుగల సీజన్ ప్రారంభమైంది.. మళ్లీ గుంపులుగా చేరుతున్నారు.. అంతా కలుసుకుంటున్నారు. ఇదే సమయంలో.. కోవిడ్ రూల్స్ను బ్రేక్ చేస్తున్నారని ఓ సర్వే చెబుతోంది.. కేంద్ర ప్రభుత్వం సైతం కొవిడ్ నిబంధనల విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది.. అయితే, ప్రజలు మాత్రం కరోనా పోయిందన్న ఆలోచనలో జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. మాస్క్లు ధరించకపోవడంతో పాటు, భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నట్లు తేల్చింది.. ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్క్లు ధరిస్తున్నవారు కేవలం 13 శాతమేనని, భౌతిక దూరం పాటిస్తున్నది మరీ 6 శాతమేనని తమ తాజా సర్వేలో తేలినట్లు కమ్యూనిటీ ఆధారిత ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ తన అధ్యయనంలో పేర్కొంది.
భారత్ వ్యాప్తంగా సర్వే చేసింది ఆ సంస్థ.. దేశంలోని 366 జిల్లాల్లో 65 వేల మంది నుంచి వివరాలు సేకరించింది. జూన్లో చేసిన అధ్యయనం మేరకు.. 29 శాతం మంది మాస్క్లు ధరిస్తుండగా, 11 శాతం మంది భౌతిక దూరం పాటిస్తున్నారు. నాటి సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖనే మీడియాకు వెల్లడించడం గమనార్హం. అయితే, కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తూ వచ్చిన సమయంలోనే ప్రజల్లో చైతన్యం ఇలా ఉంటే.. మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అనేది ఆందోళనకు గురిచేస్తోంది.. మరోవైపు.. పండుగ సీజన్ ప్రారంభం కావడం.. పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో.. మరో మూడు నెలల పాటు అంతా అప్రమత్తంగా ఉండాలని.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఎయిమ్స్ లాంటి సంస్థలు హెచ్చరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.