ఇంటి పెద్ద ఎమ్మెల్యేగా ఉంటే.. కుటుంబసభ్యులు నియోజకవర్గంలో పెత్తనం కామన్. సాగినంత కాలం పర్వాలేదు. శ్రుతి మించిందో రచ్చ రచ్చే. ఆ నియోజకవర్గంలోనూ అదే జరుగుతోందట. ఎమ్మెల్యే భార్య, కుమారుడు షాడోలుగా చక్రం తిప్పుతున్నారట. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం.
ఖేడ్లో ఎమ్మెల్యే భార్య షాడోగా ఉన్నారా?
ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్. ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్ఎస్ నేత భూపాల్రెడ్డి. ముందు నుంచీ రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం కావడం వల్లో ఏమో.. భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయినా.. ఆయన ఇంటి నుంచి మరో ఇద్దరు షాడో ఎమ్మెల్యేలుగా పెత్తనం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి. ఎమ్మెల్యే భార్య జయశ్రీ భర్త కంటే యాక్టివ్ అట. కార్యక్రమాలేవీ ఆమె మిస్ కారట. విషయం తెలిస్తే.. వెంటనే ఇన్వాల్వ్ అవుతారని చెబుతారు. ఓ మాదిరి సమస్య అయితే.. ఎమ్మెల్యే వరకు ఎందుకు.. నేను చెబుతున్నానుగా.. మీ పనైపోయింది వెళ్లిరండి అని ఆమె ఎంతో ధైర్యం ఇస్తారట. కొంతవరకు ఇది ఓకే కానీ.. డోస్ పెరిగితేనే ఇబ్బందిగా ఉంటోందని కేడర్ వాపోతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే కుమారుడి హడావిడి తక్కువేం కాదట!
టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్నవాళ్లను పక్కన పెట్టి సొంత వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తోందట ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కుటుంబం. దీంతో జెండా మోసిన కార్యకర్తలతో ఎమ్మెల్యేకు గ్యాప్ వస్తోందని చర్చ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల పంపకాల్లో సొంత వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రుసరుసలు కొనసాగుతున్న సమయంలోనే భూపాల్రెడ్డి కుమారుడు రోషన్ కాబోయే ఎమ్మెల్యేనంటూ చేస్తున్న హడావిడి తక్కువేం లేదట. రోషన్ స్థాయిలోనూ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు టాక్.
వేరే పార్టీల నేతలతో అధికారులు మాట్లాడితే ఎమ్మెల్యే ఫైర్!
మూకుమ్మడి సెలవులు పెడదామని ఉద్యోగుల్లో చర్చ?
ఇదంతా ఒక ఎత్తైతే.. నారాయణఖేడ్లో స్థానిక ప్రజాప్రతినిధులు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అస్సలు ఊరుకోరట. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తారని చెబుతారు. ఇక విపక్ష పార్టీల నాయకులతో అధికారులు మాట్లాడినట్టు తెలిస్తే వారి పనైపోయినట్టేనట. ధర్నాలు.. ఆందోళనల పేరుతో వచ్చే వివిధ పార్టీల నాయకులను అధికారులు కలిసినా అస్సలు ఊరుకోరట. వాళ్లతో మీకేం పని.. దేనికైనా నేనే ఫైనల్ అని ఓ రేంజ్లో క్లాస్ తీసుకుంటరాని ప్రచారం జరుగుతోంది. భూపాల్రెడ్డి వైఖరితో ఇబ్బంది పడుతున్న కొందరు అధికారులు తమ కెరీర్ డ్యామేజ్ అవుతోందని మథన పడుతున్నట్టు సమాచారం. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి మూకుమ్మడి సెలవులు పెట్టేద్దాం అన్నట్టుగా ఎంప్లాయిస్ మధ్య చర్చ జరుగుతోందట.
కుటుంబ సభ్యులను కట్టడి చేయలేకపోతున్నారా?
షాడో ఎమ్మెల్యేలతో పార్టీ కేడర్.. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కఠిన వైఖరితో అధికారులు నారాయణఖేడ్లో నలిగిపోతున్నారట. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. ఎమ్మెల్యే ఎందుకిలా ఉంటున్నారు? అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో తెలియదా? కుటుంబ సభ్యులను కట్టడి చేయకపోతే ఎలా? అనే పశ్నలు అధికారపార్టీ శిబిరంలో ఉన్నాయట. మరి.. భూపాల్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారో ఏమో.. ఆయన వైఖరి.. కుటుంబసభ్యుల తీరు ప్రతిరోజూ చర్చకు దారితీస్తోంది.