నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ సినిమాలే కావటం విశేషం.. అంతేకాదు, వీరి సినిమాలు కూడా ప్రేమించటం, విడిపోవటం చుట్టే తిరిగాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో సమంత తెరకు పరిచయం అయింది. ఈ సినిమా నుంచే చైతన్య-సమంత ప్రేమలో పడగా.. చాలా కాలం వరకు మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ సినిమా ఇద్దరికి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత వీరిద్దరూ తిరిగి వెనక్కిచూసుకోలేదు. వీరిద్దరికి ఇష్టమైన సినిమా కూడా ఇదే కావటం విశేషం..
ఇక వీరిద్దరూ కలిసిన నటించిన మరో చిత్రం ‘ఆటో నగర్ సూర్య’.. వసూళ్లపరంగా ఈ సినిమా కాస్త నిరాశపరిచిన.. వీరిద్దరిని నటన పరంగా పరిణితి చెందేలా చేసింది ఈ సినిమా.. దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భిన్నమైన సినిమాగా గుర్తిండిపోయింది.
అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన సినిమా ‘మనం’.. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, చైతన్య, అఖిల్ కలిసి నటించారు. ఓ రకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో భాగమైన సమంత కూడా పెళ్లి కాకముందే నటించడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం ఇదే.. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు.
ఇక ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణలతో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘మజిలీ’.. ఈ సినిమాలో సమంత నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. భర్త (నాగచైతన్య) మనసుకు తగిలిన ప్రేమ గాయం మాని ఏనాటికైనా తనపై ప్రేమ కురిపిస్తాడని భార్య (సమంత) పడే నిరీక్షణ సినిమాలో హైలైట్ పాయింట్ గా నిలిచింది.. భావోద్వేగ సన్నివేశాలు.. బలమైన డైలాగ్స్తో దర్శకుడు శివ నిర్వాణ మంచి ఫీల్ను కలిగించాడు.