టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ఇక, బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు సజ్జల.. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్న ఆయన.. ఇలా బూతులు మాట్లాడటం తప్పు కాదంటే అదే విషయం చెప్పాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజామోదం ఏ రకంగా ఉందో అందరూ చూశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ నేతలు ఉద్యమం చేస్తున్నారని సెటైర్లు వేసిన ఆయన.. సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయారని.. ఇటువంటి దౌర్భాగ్యపు పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యల చేయించినందుకు చంద్రబాబు.. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నది మా ఏకైక డిమాండ్ అన్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మేం కూడా వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ప్రజలందరూ చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చిన సజ్జల.. సీఎం వైఎస్ జగన్ ఆపుతున్నారు గనుక కార్యకర్తలు సహనంగా ఉన్నారు.. కానీ, సహనానికీ ఒక హద్దు ఉంటుందన్నారు. టీడీపీ లైన్ దాటిందని.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి.