గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది.
అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది. ఉద్యమకాలం నుంచి ఇక్కడి ప్రజలతో మమేకమైన ఈటెలను ఓడించటం అంత సులభం కాదని టీఆర్ఎస్కు తెలుసు. అందుకే పక్కా ప్రణాళికతో ఎన్నికలకు వెళుతోంది. మంత్రి హరీష్ రావు సారధ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హుజూరాబాద్లో మకాం వేసి చక్రం తిప్పుతున్నారు. ఇతర పార్టీల నుంచి రాత్రికి గులాబీ దండులో చేరుతున్నారు. మండలానికో మంత్రి ప్రచారాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఏ వర్గాలకు ఏం కావాలో …ఏ గ్రామాంలో ఏ సమస్య ఉందో తెలుసుకుని యాక్షన్లోకి దిగుతున్నారు. కోట్లాది రూపాయల నిధుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా రెండు వేల కోట్ల రూపాయాలతో ప్రమోగాత్మకంగా ప్రారంభించిన దళితబంధు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలకు నియోజకవర్గంలో నిధుల వరద పారిస్తోంది టీఆర్ఎస్.
మరోవైపు ఈటల రాజేందర్ ఈ పోరును డబ్బు వర్సెస్ ఆత్మగౌరవంగా అభివర్ణిస్తున్నారు. ఈ స్లోగన్ని జనంలోకి బలంగా తీసుకువెళుతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళుతూ ఓటర్లను పలకరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్టోబర్ 2న పాదయాత్ర చేయనున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హుజూరాబాద్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. భారీ మెజార్టీతో తమ గెలుపు ఖాయమని కాషాయదళం బావిస్తోంది. ఈటెల రాజేందర్ని అన్యాయంగా మంత్రి పదవి నుంచి తొలగించటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి సానుభూతి ఓటు సంపాదించాలన్నది ఆ పార్టీ వ్యూహం. ప్రస్తుతం ఈటెల వైపు సానుభూతి పవనాలు వీస్తున్నట్టే కనిపిస్తోంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.
హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారనుందా! నియోజకవర్గంలో 2 లక్షల 36 వేల మంది ఓటర్లున్నారు. అందులో బీసీలు లక్షా 32వేలు, కాగా దళితులు 45వేల మంది. ఓసీలు 31 వేలు, మైనార్టీలు 6 వేలు, 2 వేల మంది ఎస్టీ ఓటర్లున్నారు. ఈ లెక్కల ప్రకారం బీసీలదే మెజార్టీ అని తెలుస్తోంది. వారి తర్వాత దళితుదే అగ్ర తాంబూలం. ఈ ఈక్వేషన్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఇరు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే మధ్యలో కాంగ్రెస్ పోషించబోయే పాత్ర కూడా రెండు పార్టీల గెలుపు ఓటములలో కీలకం కానుంది. కాంగ్రెస్కు పడే ఓట్లు ఎవరికి డ్యామేజ్ చేస్తాయన్నది ఎన్నికల తరువాత గాని తెలియదు.
