భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి చేరే పండుగ సంక్రాంతి అని ఆయన అన్నారు.
చెన్నైలో కొట్టూర్పురంలోని ఆయన నివాసం వద్ద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీసమేతంగా భోగి మంటలు వేశారు. సకల జనులకు భోగి.. సుఖసంతోషాలు కలిగించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. అందిరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలన్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి, తెలుగువారంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆయన అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవాలని ఆయన అన్నారు. ప్రతి తెలుగు లోగిలిలో సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఉన్నా సందడిగా పండుగ జరుపుకోవాలన్నారు.