ఆఫ్ఘనిస్థాన్లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్ల సహా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. మరోవైపు.. కాబూల్లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.. ఆఫ్ఘన్లో ఉన్నవారిని తరలించే ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.