సింహాలు, పులులు, ఏనుగులను దత్తత తీసుకుని వాటి సంరక్షణకు పాటుపడడం చాలామంది చేస్తుంటారు. తాజాగా దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి కూతుళ్ళు ఇలాంటి మంచిపనికి పూనుకున్నారు. విజయారెడ్డి, పావనీరెడ్డి హైదరాబాద్ జూపార్క్లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో కార్పొరేటర్ అయిన విజయారెడ్డి, సోదరి పావనీరెడ్డి నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ రాజశేఖర్ను కలిసిన వీరిద్దరూ సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కు అందించారు.
డిసెంబరు 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ సింహాన్ని దత్తత తీసుకున్నట్టు విజయారెడ్డి తెలిపారు. తండ్రి పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి నిర్ణయం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ తేజ్ భార్య అయిన ఉపాసన కొణిదెల విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు.