ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది.
Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక వీడినట్లేనా..?
అయితే తాము చేపట్టే మహా పాదయాత్రకు ప్రముఖుల మద్దతును అమరావతి రైతులు కోరుతున్నారు. ఈ మేరకు వారు శుక్రవారం నాడు విజయవాడలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ను కలిశారు. తమ మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. దాదాపుగా తాము అమరావతి రాజధాని కోసం రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రావడంలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు పవన్కు అమరావతి ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రైతుల మహాపాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు.