పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు.
టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకునేందుకు, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నేడు జరిగే అఖిలపక్ష సమావేశంలో “వ్యవసాయ చట్టాల రద్దు” ప్రధాన చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు.
అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, “కనీస మద్దతు ధర”ల పెంపుపై చట్టపరమైన భరోసా కోసం రైతుల డిమాండ్ ల పై సమావేశంలో చర్చిస్తారు. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును మొదటి రోజు (సోమవారం) లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రేపు (సోమవారం) ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్లు జారీ చేశాయి అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు.
