కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ భారత్లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం భారత్లో ఒమిక్రాన్ కేసు సంఖ్య 600లకు చేరింది. దేశంలో ఒమిక్రాన్ 19 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాప్తిచెందుతోంది.
ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించాయి. తాజాగా ఉత్తరాఖండ్లో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.