Site icon NTV Telugu

ఒమిక్రాన్‌తో ఆందోళన వద్దు.. ఇలా చేయండి..!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్‌ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్‌ రిస్క్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి వచ్చే అందరికీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని.. సాధారణ టెస్ట్‌ల్లో భాగంగా.. ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిందన్నారు.. పాజిటివ్‌గా తేలిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో పెట్టామని వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.

Read Also: బిగ్‌ బ్రేకింగ్‌: తెలంగాణను తాకిన ఒమిక్రాన్

గత, అనుభవాల దృష్ట్యా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రత్యేకంగా మూడు అంశాలపై దృష్టిసారించాం అన్నారు మంత్రి హరీష్‌రావు.. ఆక్సిజన్‌ పడకల ఏర్పాటు, ఐసోలేషన్‌ కిట్స్‌, ఆక్సిజన్‌ నిల్వలపై ఫోకస్‌ పెట్టామన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 25,390 ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేశామన్నారు.. ఇక, 25 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్స్‌ ఏర్పాటు చేశామని.. ఆక్సిజన్‌ రోజువారి ఉత్పత్తి సామర్థ్యాన్ని 327 మెట్రిక్‌ టన్నులకు పెంచామని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. భయపడాల్సిన పనేలేదు.. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌పై ఉన్న సమాచారం ప్రకారం.. డెత్ రేటు ఎక్కువగా లేదు.. కానీ, స్పీడ్‌గా విస్తరిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరం పాటిస్తూ.. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 97 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ వేశామని.. 54 మందికి సెకండ్‌ డోస్‌ కూడా పూర్తిఅయ్యిందని తెలిపారు హరీష్‌రావు.. మిగతా వారు వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని.. 100 శాతం వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఒమిక్రాన్‌ను నియంత్రించవచ్చు అన్నారు.

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. కేసులు పెరిగితే విధించాల్సిన ఆంక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ ఫాలో అవుతామని.. సీఎం కేసీఆర్‌తో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.. ఇక, స్కూళ్ల నిర్వహణపై కూడా చర్చించి.. పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకుంటామన్న హరీష్‌రావు.. ఒమిక్రాన్‌ నేపథ్యంలో… బూస్టర్‌ డోస్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశాం.. కేంద్రం నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం అన్నారు.. ఇప్పటికైనా ప్రజలు వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలు వదిలి వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు మంత్రి హరీష్‌రావు.

Exit mobile version