సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు.
మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్న పిల్లలు కరోనా తరువాత స్కూల్ కి వెళితే ఎలా వుంటుందో ఈ ఫంక్షన్ నాకు అలా వుంది. ఇలా ఫంక్షన్స్ కి వచ్చి ఈలలు వింటూ వుంటే ఆ కిక్కే వేరు. నారాయణ్ దాస్ నారంగ్ గారు నాకు ఎంతో సన్నిహితులు. వాళ్ల అబ్బాయి సునీల్ తండ్రికి మించిన తనయుడు. వీళ్ళు మరింత ఎత్తుకి ఎదగాలి మరిన్ని సినిమాలు తీయాలి. నాగ్ కొడుకు చైతన్య చాలా కూల్ గా వుంటాడు. చాలా నిలకడగా, నిదానంగా వుంటాడు.. అతను తీసుకొనే నిర్ణయాలు చాలా కాంసెంట్రీవ్. సాయిపల్లవి వెరీ గుడ్ డాన్సర్. ఒక సినిమాలో సాయిపల్లవి నా చెల్లెలి క్యారెక్టర్ వెయ్యాలి కానీ చెయ్యను అంది అలా ఎందుకు అన్నది నాకు తెలీదు.
శేఖర్ కమ్ముల తనకు తాను ఏమనుకుంటారో అదే తీస్తారు కమర్షియల్ అంశాలు పట్టించుకోరు. అందుకే ఆయన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి. ‘సారంగాధరియా’ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ సాంగ్ కోసం నేను ఈసినిమా రెండు మూడు సార్లు చూస్తాను.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 20% మాత్రమే. దీనికి సినిమా వాళ్ళు అందరూ పచ్చగా వున్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. ప్రమాదాలు వచ్చినా, ఏ విపత్తు వచ్చినా స్పందించేది ఫస్ట్ సినిమా ఇండస్ట్రీనే. రెండు తెలుగు ప్రభుత్వాలకు నేను విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు కూడా పరిష్కరించండి. దయచేసి రెండు తెలుగు ప్రభుత్వాలు సినీ పరిశ్రమ సమస్యలపై దృష్టి పెట్టి జీవో ఇవ్వాల్సిందిగా విన్నపం’ అంటూ చిరంజీవి కోరారు.