అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది ఏప్రిల్ 13. ఈ సందర్భంగా ఆ మర్నాడే గురువారం ‘కేజీఎఫ్ 2’ను వరల్డ్ వైడ్ విడుదల చేస్తారని భావించొచ్చు.
నిజానికి కరోనా సెకండ్ వేవ్ అనేది లేకపోయి ఉంటే… జూలై 16న ‘కేజీఎఫ్ -2’ వరల్డ్ వైడ్ విడుదలై ఉండేది. కానీ ఈ పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా కనీసం ద్వితీయార్థం చివరిలో అయినా ఖచ్చితంగా సినిమా వస్తుందనియశ్ అభిమానులు భావించారు. కానీ నిర్మాతల తాజా నిర్ణయంతో వారంతా తీవ్ర నిరాశకు గురైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ యేడాది భారీ చిత్రాలకు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు రైట్ టైమ్ కాదని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టుగా అర్థమౌతోంది. ఇదిలా ఉంటే… ‘కేజీఎఫ్ -2’ 2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో వచ్చే వేసవికి విడుదల కావాల్సిన మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది.