కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం… కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయని అంటున్నారు. మరో అసంతృప్త మంత్రి ఎంబీటీ నాగరాజ్ అంశం కూడా పరిష్కారం అయ్యిందని చెప్పారు సీఎం బొమ్మై.
కాగా, బసవరాజ్ బొమ్మై ఇటీవల 29 మందితో క్యాబినెట్ విస్తరణ చేశారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప విధేయులైన పలువురు బీజేపీ నేతలకు ఇందులో చోటు దక్కకపోవడంతో బాహాటంగానే కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త మంత్రులు నాగరాజ్, ఆనంద్ సింగ్ తమ శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారితో బొమ్మై చర్చలు జరుపుతూ బుజ్జగింపులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. మరోవైపు.. సీఎం పదవి త్యాగం చేసిన యడియూరప్ప.. తన కుమారుడికి డిప్యూటీ సీఎం పోస్ట్ వస్తుందని ఆశించారు.. కనీసం మంత్రి పదవి అయినా దక్కుతుందని భావించారు.. కానీ, యడియూరప్ప ఆశలకు గండి కొట్టింది బీజేపీ అధిష్టానం.