టీడీపీలో భావి సీఎంగా ప్రచారం అవుతున్న లోకేష్ బాబును వచ్చే ఎన్నికలకు పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ను ప్రకటించాలని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే కొద్దిరోజలుగా టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసేలా కార్యక్రమాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో ప్రస్తుతం అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అర్థమవుతోంది.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ కు ఎమ్మెల్సీతోపాటు మంత్రి పదవి దక్కింది. మంత్రిగా ఆయన ఫార్మామెన్స్ ఎలా ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఒక సీఎం కొడుకుగా, మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసిన తొలిసారే ఓడిపోవడం టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఒక్క ఎన్నికతో లోకేష్ కెపాసిటీ ఏంటో అందరికీ తెల్సివచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులే లోకేష్ బాబు ప్రత్యక్ష రాజకీయాలకు సెట్ కాడని కామెంట్స్ చేస్తున్నాయి.
అయితే చంద్రబాబు మాత్రం పుత్సవాత్సాల్యంతో లోకేష్ ను భవిష్యత్ సీఎంగా చేయాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్న వారికి పెద్దపీఠ వేస్తుండగా.. వ్యతిరేకించే వారిని బయటికి పంపే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే టీడీపీలోని కొందరు సీనియర్లు మాత్రం లోకేష్ బాబు సీఎం అభ్యర్థిగా తగడని చంద్రబాబుకు సూచిస్తున్నారట. అయితే వారి మాటలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారట. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీకి భవిష్యత్ ఉండదని ముందుగానే ఊహించిన నేతలంతా వరుసగా పార్టీని వీడడానికి కారణం అని ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం టీడీపీలో కలకలం రేపింది.
గోరంట్ల బచ్చయ్య తొలి నుంచి లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనీసం ఆయన ఫోన్ కూడా లిప్ట్ చేయడం లేదని ఆవేదనతో ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారం పార్టీకి చేటు తెచ్చేలా ఉండటంతో చంద్రబాబు అలర్ట్ అయి గోరంట్లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు అంశాలను వీరిద్దరు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో ముఖ్యంగా లోకేష్ బాబు నాయకత్వంపై గోరంట్ల పలు సందేహాలను లేవనెత్తినట్లు సమాచారం.
2024 ఎన్నికల్లో బాబుగారే సీఎం అభ్యర్థిగా ఉండాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అలా కాదని నారా లోకేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అసలుకే మోసం వస్తుందని సూచించారట. ఒకవైపు వైసీపీ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తుండటంతో టీడీపీ నారా లోకేష్ తో ప్రయోగాలు చేయడం పార్టీకి మంచిది కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పార్టీ ఉనికే ప్రమాదం అని బుచ్చయ్య చౌదరి చెప్పారట. దీంతోపాటు 2024లో టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబేనని శ్రేణులకు క్లారిటీ ఇవ్వాలని కోరారట. బుచ్చయ్య సూచనలు సమంజసంగానే ఉన్నాయని భావించిన చంద్రబాబు సైతం అలానే అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో 2024లో సీఎం అభ్యర్థిగా చంద్రబాబే ఉంటాయని పార్టీ శ్రేణులకు సంకేతాలు వెళుతున్నాయట. దీంతో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఢీకొట్టేది బాబుగారే అనే టాక్ విన్పిస్తుంది. దీంతో టీడీపీలో లోకేష్ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.