కరోనా నుంచి బయటపడ్డాం. ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునే లోపే చాపకింద నీరులా ఒమిక్రాన్ రూపంలో మరో భయంకర కొత్త వేరియంట్ వచ్చేసింది. దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్.. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రపంచదేశాలకు క్రమేపీ పాకుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. భారత్లోకి కూడా ప్రవేశించి సవాల్ విసురుతోంది.
కరోనా థర్డ్ వేవ్ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ ఇప్పటికే ప్రకటించారు. కానీ మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. థర్డ్ వేవ్ జనవరి నాటికే ఇండియాలో ప్రభావం చూపవచ్చంటోంది ఐఎంఏ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నా.. ఇంకా రిస్క్ గ్రూప్లో వున్న పిల్లల విషయంలో అప్రమత్తం అవసరం అంటున్నారు.12-18 సంవత్సరాల వయసున్న పిల్లలకు తక్షణం వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. గతంలో అనేక మార్లు ఈ విషయంలో చిన్న పిల్లలతో పాటు 12-18 వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించాలంటోంది ఐఎంఏ.
రెండు డోస్లు వేయించుకున్న వారికి కూడా బూస్టర్ డోస్ ఆవశ్యకతను నొక్కివొక్కాణించింది ఐఎంఎ. బూస్టర్ డోస్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు తక్షణం అందించాలంటోంది ఐఎంఏ. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ సవాల్ విసురుతోంది. మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలో కేసులు వున్నాయి. ఇతర దేశాల అనుభవాల నేపథ్యంలో తక్షణం అప్రమత్తం కావాలి. వారంలోనే మనదేశంలో ఒమిక్రాన్ కేసులు రెండింతలు అయ్యాయి. జనవరి నుంచే థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని, సెకండ్ వేవ్ కంటే కాస్త తక్కువగానే దీని ప్రభావం ఉంటుందంటున్నారు. ఓమిక్రాన్ యొక్క తీవ్రత డెల్టా వేరియంట్లో కనిపించే దానిలా లేదు. దక్షిణాఫ్రికాలో నమోదైన కేసులపై పరిశోధకులు నిశితంగా పరిశోధిస్తున్నారు.