తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. భారత ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన జవాను సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
తమిళనాడు లోని కూనూరు సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హెలీకాప్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఇయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన 11 మంది జవాన్లలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ ప్రకటించింది.
జిల్లాకు చెందిన సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ కు సాయితేజ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. సాయితేజ్ మృతితో ఎగువరేగడ గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలముకొన్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలిపింది ఆర్మీ. ఉదయం 8.30 గంటలకు భార్యకు ఫోన్ చేశారు సాయి తేజ. సాయి తేజ భార్య పేరు శ్యామల. కొడుకు మోక్షజ్ఞ,కూతురు దర్శిని. తల్లి ఎగువరేగడ మాజీ ఎంపీటీసీ.సాయితేజ ఆకస్మికమరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరు అవుతున్నారు.