టీ20 ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది.
అబుదాబీ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు గ్రూప్ స్టేజీలో ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయాయి. గ్రూప్-1లో ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాపై ఓటమి చెందగా.. గ్రూప్-2లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటికే ఓ సారి టీ20 ప్రపంచకప్ అందుకున్న ఇంగ్లండ్ జట్టు రెండోసారి కప్పును ముద్దాడాలంటే కివీస్తో అద్భుతంగా ఆడాల్సిందే. అయితే ఆ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఓపెనర్ జాసన్ రాయ్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పేసర్ టైమల్ మిల్స్ తొడకండరాల గాయంతో దూరమయ్యాడు. బట్లర్, మలాన్, బెయిర్ స్టో, మోర్గాన్, మొయిన్ అలీలతో బ్యాటింగ్ విభాగం బాగానే కనిపిస్తున్నా.. మార్క్ వుడ్, జోర్డాన్, వోక్స్ బౌలింగ్లో ఎంతమేరకు రాణిస్తారనే విషయంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Read Also: టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?
మరోవైపు న్యూజిలాండ్ తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే వరల్డ్ కప్లో తమకు జరిగిన పరాభవానికి ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఆ జట్టు ముఖ్యంగా పేసర్లపైనే ఆధారపడి ఉంది. ఈ టోర్నీలో బౌల్ట్, మిల్నే, సౌథీ, సోధీ, శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్లో కూడా గప్తిల్, మిచెల్, విలియమ్సన్, కాన్వే, ఫిలిప్స్లతో బలంగానే కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.