వీకెండ్ వచ్చిందంటే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మందేసి చిందేసి రోడ్లమీదకి వచ్చి మరీ అమాయక జనం ప్రాణాలు తీసేస్తున్నారు.మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం బలయింది. మొయినబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతిచెందింది.
ప్రస్తుతం సౌమ్య,అక్షర గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. అక్షర (14) తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సౌమ్య (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రేమిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అందరూ మొయినబాద్ లో నివాసులే. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. ఈ ప్రమాదం కారణంగా ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.