దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధ విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రజలంతా కోవిడ్ పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడిలోకి వచ్చింది.
అయితే భారత్ కు కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు కొద్దిరోజులుగా బలంగా విన్పిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అలాగే కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావడంతో టీకాల పంపిణీ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల దేశంలో వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం దేశంలో 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి ఉచితంగా కోవిడ్ టీకాలను వేస్తున్నారు.
కరోనాపై అవగాహన ఉన్న ప్రజలంతా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా కోవిడ్ టీకాను వేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఇబ్బందికరంగా మారుతోంది. దేశ వ్యాప్తంగా 60శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే థర్డ్ వేవ్ ముప్పును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో నవంబర్ నెల దాటితేగానీ భారత్ లో థర్డ్ వేవ్ ప్రమాదం పూర్తిగా తొలగిపోయింది? లేనిది చెప్పలేమని వారంటున్నారు.
థర్డ్ వేవ్ కనుక వస్తే ఆ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వారికి పెద్దగా ప్రమాదం ఏమి ఉందని వారంటున్నారు. కానీ వీరి నుంచి పెద్దలకు సోకే ప్రమాదం ఉంటుందని గుర్తుచేస్తున్నారు. యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండి పెద్దలను కాపాడుకోవాల్సి బాధ్యత ఉందనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. తద్వారా పెద్దలను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా పూర్తిగా దూరం కాలేదు. ఈ పరిస్థితుల్లో కోవిడ్ ను పూర్తిగా తరిమికొట్టాలంటే ప్రతీఒక్కరు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ఈ విషయంలో యువత, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.