పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రాజీనామా తరువాత పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనపై నమ్మకం లేదని, పార్టీలో అంతర్గత కలహాలపై తాను అనేకమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అయితే, పార్టీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని, తనను అవమానించే విధంగా వారి ప్రవర్తన ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో తనను మూడుసార్లు ఢిల్లీకి పిలిచారని, తాను వివరణ ఇచ్చినప్పటికీ తనపై పార్టీలో కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం తాను రాజీనామా చేశానని, ఇప్పుడు పార్టీ ఎవర్నైనా ముఖ్యమంత్రిగా నియమించుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, భవిష్యత్తు కార్యచరణపై తన అనుచరులతో కలిసి మాట్లాడిన తరువాత ప్రకటిస్తానని కెప్టెన్ పేర్కొన్నారు.